₹2000 విలువ గల బ్యాంక్ నోట్లు - చలామణి నుండి ఉపసంహరణ; చట్టబద్ధమైన చలామణిగా కొనసాగుతుంది
మే 19, 2023 ₹2000 విలువ గల బ్యాంక్ నోట్లు - చలామణిలో ఉన్న అన్ని ₹500 మరియు ₹1000 నోట్ల చట్టబద్ధమైన స్థితి ఉపసంహరణ తర్వాత ఆర్థిక వ్యవస్థ యొక్క కరెన్సీ అవసరాన్ని త్వరితగతిన తీర్చడానికి, భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934లోని సెక్షన్ 24(1) ప్రకారం ₹2000 విలువ గల బ్యాంక్ నోట్ నవంబర్ 2016లో ప్రవేశపెట్టబడింది. ఇతర విలువ గల నోట్లు తగిన పరిమాణంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ₹2000 నోట్లను ప్రవేశపెట్టాలనే లక్ష్యం నెరవేరింది. అందువల్ల, 2018-19లో ₹2000 నోట్ల ముద్రణ నిలిపివేయబడింది. 2. ₹2000 విలువ గల బ్యాంక్ నోట్లలో దాదాపు 89% మార్చి 2017కి ముందు జారీ చేయబడ్డాయి మరియు వాటి జీవిత కాలపు 4-5 సంవత్సరాల వ్యవధి ముగింపు దశకు చేరువలో వున్నాయి. మార్చి 31, 2018 నాటికి (చలామణిలో ఉన్న నోట్లలో 37.3%) గరిష్టంగా ఉన్న ₹6.73 లక్షల కోట్ల నుండి, మార్చి 31, 2023న చలామణిలో ఉన్న ఈ నోట్ల మొత్తం విలువ ₹3.62 లక్షల కోట్లకు తగ్గి, చలామణిలో ఉన్న నోట్లలో కేవలం 10.8% మాత్రమే ఉన్నాయి. ఈ విలువ గల కరెన్సీ నోట్ సాధారణంగా లావాదేవీలకు ఉపయోగించబడదని కూడా గమనించబడింది. ఇంకా, ఇతర విలువ గల నోట్ల స్టాక్ ప్రజల కరెన్సీ అవసరాలకు సరిపోయేలా కొనసాగుతోంది. 3. పైన పేర్కొన్న వాటిని దృష్టిలో ఉంచుకుని, మరియు భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క “క్లీన్ నోట్ పాలసీ” ప్రకారం, ₹2000 విలువ గల నోట్లను చలామణి నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయించబడింది. 4. ₹2000 విలువ గల బ్యాంక్ నోట్లు చట్టబద్ధమైన చలామణిగా కొనసాగుతాయి. 5. చలామణి నుండి ఈ తరహా నోట్ల ఉపసంహరణను భారతీయ రిజర్వు బ్యాంకు 2013-2014లో చేపట్టిందని గమనించవచ్చు. 6. తదనుగుణంగా, ప్రజలు తమ బ్యాంక్ ఖాతాల్లో ₹2000 నోట్లను జమ చేయవచ్చు మరియు/లేదా ఏదైనా బ్యాంక్ శాఖలో ఇతర విలువ గల నోట్లు గా మార్చుకోవచ్చు. బ్యాంకు ఖాతాలలో సాధారణ పద్ధతిలో జమ, అంటే పరిమితులు లేకుండా మరియు ప్రస్తుత సూచనలు మరియు ఇతర వర్తించే చట్టబద్ధమైన నిబంధనలకు లోబడి, చేయవచ్చు. 7. కార్యనిర్వహణ సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటూ మరియు బ్యాంక్ శాఖల సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా ఉండటానికి, మే 23, 2023 నుండి ₹2000 బ్యాంక్ నోట్లను ₹20,000/- పరిమితి వరకు ఇతర విలువ గల నోట్లు గా ఏ బ్యాంకులోనైనా మార్చుకోవచ్చు. 8. ఈ ప్రక్రియను సమయానుకూలంగా పూర్తి చేయడానికి మరియు ప్రజలకు తగిన సమయాన్ని అందించడానికి, అన్ని బ్యాంకులు సెప్టెంబర్ 30, 2023 వరకు ₹2000 నోట్లకు జమ మరియు/లేదా మార్పిడి సౌకర్యాన్ని అందించాలి. బ్యాంకులకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి. 9. మే 23, 2023 నుండి జారీ విభాగాలను1 కలిగి ఉన్న భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క 19 ప్రాంతీయ కార్యాలయాల (ROలు) వద్ద ఒకసారి ₹2000 నోట్లను ₹20,000/- పరిమితి వరకు మార్చుకునే సదుపాయం కూడా అందించబడుతుంది. 10. తక్షణమే అమలులోకి వచ్చే విధంగా ₹2000 విలువ గల నోట్లను జారీ చేయడాన్ని నిలిపివేయాలని భారతీయ రిజర్వు బ్యాంకు అన్ని బ్యాంకులకు సూచించింది. 11. ₹2000 నోట్లను జమ చేయడానికి మరియు/లేదా మార్చుకోవడానికి సెప్టెంబర్ 30, 2023 వరకు సమయాన్ని ఉపయోగించుకోవాలని ప్రజలను ప్రోత్సహిస్తున్నాము. ఈ విషయంలో తరచుగా అడిగే ప్రశ్నలు (FAQలు)పై ఒక పత్రం ప్రజల సమాచారం మరియు సౌలభ్యం కోసం భారతీయ రిజర్వు బ్యాంకు వెబ్సైట్లో ఉంచబడింది. (యోగేష్ దయాల్) పత్రికా ప్రకటన: 2023-2024/257 1 అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్నా మరియు తిరువనంతపురం |
పేజీ చివరిగా అప్డేట్ చేయబడిన తేదీ: